(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాన్ని అమిత్ షా వదులుకోవడం దేనిని సూచిస్తున్నదన్న ఊహాగానాలు పార్టీ వర్గాలలో సాగుతున్నాయి.
శ్రీనగర్లో నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫారూఖ్ అబ్దుల్లాను పార్లమెంట్ సమావేశాలకు రానివ్వాలన్న ప్రస్తావన ఆదివారం అఖిలపక్ష సమావేశంలో వచ్చినపుడు, మాజీ మంత్రి చిదంబరంను కూడా లోక్సభకు రానివ్వాలని కాంగ్రెస్ కోరింది. వెంటనే విజయసాయి రెడ్డి అందుకుని, గతంలో జైలులో ఉన్న అప్పటి ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోక్సభ సమావేశాలకు రానివ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిదంబరంను రానివ్వాలనడం రెండు నాల్కల ధోరణి అంటూ వ్యాఖానించారు.
దానిపై ప్రతిపక్షసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా రిపోర్టు చేసింది. ఆ వెంటనే అమిత్ షా అందుకుని, మీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తారంటూ చివాట్లు పెట్టారని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాకు చెప్పారు.
కొద్దిరోజులుగా రాష్ట్రంలో వైసిపికీ, టిడిపికీ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అధికారపక్షంతో టిడిపి నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇసుకతో మొదలుపెట్టి తాజాగా వల్లభనేని వంశీ ఉదంతం వరకూ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సిబిఐ బెయిల్ రద్దు చేయిస్తే ఏమవుతుందో చూసుకోండి అంటూ టిడిపి నేతలు వైసిపి నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి వైసిపి నేతల దగ్గర సరైన జవాబు లేదు. మొత్తం మీద త్వరలోనే జగన్ బెయిల్ రద్దవుతుందన్న ఊహాగానాలు వ్యాపింపజేయడంలో టిడిపి నాయకులు విజయం సాధించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం నాటి సమావేశంలో అమిత్ షా విజయసాయి రెడ్డితో కటువుగా మాట్లాడడం వైసిపి వర్గాలను ఆలోచనలో పడేసింది. ఢిల్లీలో ఏం జరుగుతోంది అంటూ ఆరాలు ఎక్కువయ్యాయి.