అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్లో ప్రస్తావించడంతో ఈ భాషా వివాదం జాతీయ స్థాయికి చేరింది.
ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ, తెలుగు మాధ్యమ తరగతులను పూర్తిగా ఎత్తివేసే చర్యలు తీసుకోవడం వల్ల మాతృ భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాంతీయ భాషల పరిరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేశినేని కోరారు. ప్రాంతీయ భాషలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందనీ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనీ అన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ఇదే సమయంలో తెలుగు అకాడమికి కేంద్రం నుండి నిధులు విడుదల చేయాలని వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు కోరారు.
సభ్యుల ప్రశ్నలపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ సమాధానం ఇస్తూ భారతీయ భాషలను పటిష్టం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని తెలిపారు. తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.తెలుగు భాషను పటిష్టం చేసే క్రమంలో మైసూర్లోని సంస్థను నెల్లూరుకు మార్చామనీ, ఇది నవంబర్ 13 నుండి పని చేయడం ప్రారంభించిందనీ పేర్కొన్నారు. తెలుగు భాషపై చర్చలు, కార్యశాలలు, సమ్మేళనాలు ఉంటాయని ఆయన వివరించారు.