ఒక టీవీ ప్రోగ్రాం రాజకీయ దృశ్యాన్ని మార్చివేయగలదా? కొన్ని సందర్భాలలో సాధ్యమే అని చెప్పాలి. తెలంగాణాలో ఆర్టీసి సమ్మె నెలన్నరగా వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో రకరకాల విషయాలు కీలకవార్తలవుతున్నాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు ఇంగ్లీషు మీడియం వార్తలు అన్ని ఛానళ్ళను నింపేస్తున్నాయి. అటు సుప్రీంకోర్టు నవంబరు 9న అయోధ్య తీర్పు ప్రకటించిన తర్వాత పలు తీర్పులు వార్తలను ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రకటనలకు చాలా వార్తా ఛానళ్ళు ఎక్కువ సమయాన్నికేటాయిస్తున్నాయి. జగన్మోహనరెడ్డి అనుకూల ఛానళ్ళు ఈ వార్తలను ఖండించడానికీ, లేదా ఆ వార్తల రెండో పార్శ్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది సాధారణ దృశ్యం.
ఇసుక దీక్షను తెలుగుదేశం ప్రకటించింది. దానికి ముందు పవన్ కల్యాణ్ రెండు, మూడు రోజులుగా వార్తలలో ఉన్నారు. నవంబరు 13న సుప్రీంకోర్టు ఐదు తీర్పులు ప్రకటించింది. దాంతో నవంబరు 14న మామూలుగా తెలుగుదేశం పార్టీకి లభించే ‘లైవ్ కవరేజి’ ఇసుక దీక్షకు దొరకలేదు. ఆరోజు సాయంకాలం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎం.ఎల్.ఎ. వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు బాగానే పేల్చాడు. దాంతో సాయంకాలం ఆరుగంటలు, ఏడుగంటలు వార్తల బులెటిన్లకు మంచి సరుకు అయ్యింది. కానీ టీవీ 9 రాత్రి ఎనిమిదిగంటల బిగ్ డిబేట్కు వంశీని ఎంచుకున్నారు. సుమారు నలభై నిమిషాలపాటు ‘ఎక్స్ప్లోసివ్’ రీతిలో వల్లభనేని వంశీ జవాబులు టెలిఫోన్ లైన్ ద్వారా చెప్పాడు. చివర పదినిమిషాలలో రాజేంద్రప్రసాద్ గారిని ఆహ్వానించారు. ఒకరు బయట, మరొకరు స్టూడియోలో. మొదటి రెండు నిమిషాలలోనే ఎలా ఉండబోతుందో బోధపడింది. మోడరేటర్ రజనీకాంత్ సున్నితంగా వారిస్తూనే వారి వాగ్వివాదాన్ని ఐదారు నిమిషాలు కొనసాగేలా చూశాడు. వారు స్టూడియోలోనే నేరుగా ఉంటే ఏమై ఉండేది? ఎవరైనా ఊహించుకోగలరు.
ఈ సంఘటన తర్వాత టీవీ-9 స్టూడియోలో ఫలనా, ఫలానా మధ్య వాగ్వివాదం అంటూ అదే ఛానల్ లో స్క్రోలింగ్. గంట నిడివిగల కార్యక్రమాన్ని ఒక గంట తర్వాత రాత్రి పదిగంటలకు వార్తల బులెటిన్ రద్దు చేసి పునఃప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఐదారు ముక్కలు చేసి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద షేర్ చేశారు. ఇంక అంతే, చంద్రబాబు ఇసుక దీక్ష వార్తలు కానీ, ఇంగ్లీషు మీడియం ఖండన వార్తలు గానీ, పూర్తిగా గల్లంతయి పోయాయి. అన్ని ఛానళ్ళు వంశీ మాటలను చూపుతూ చర్చలు కొనసాగించాయి. ఇరు పార్టీల నాయకులు మాటలు కాదు తిట్ల దండకాలు మొదలుపెట్టారు. బహుశా ఈ స్థాయికి దిగజారడం తెలుగు రాష్ట్రాలలో ఇదే ప్రథమం కావచ్చు! దీని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
దాంతో తెలుగుదేశం పార్టీ వంశీగారి ఇదివరకు అన్న మాటల క్లింప్పింగ్లను విడుదల చేసింది. దాంతో మరింత బాణసంచా! రాజకీయాల గతిని ఛానళ్ళు మలుపు తిప్పగలవు, వేగవంతం చేయగలవు, కొనసాగించగలవు అనడానికి ఈ దృష్టాంతమే మంచి ఉదాహరణ.
సంస్కార స్థాయిని దాటి నడిచే సంభాషణను లైవ్ కార్యక్రమంలో ఎంతవరకు కొనసాగించవచ్చు? “టీవీ చర్చలో ఇద్దరు నేతలు తిట్టుకొంటుంటే ఇక తిట్టుకోవడానికి ఏమీలేదు అని గ్రహించి మా ఛానల్ లో ఇలా తిట్టుకోవడం తగదు” అని యాంకర్ చెప్పడం మంచి టైమింగ్ అని ఫేస్ బుక్లో ఒక జర్నలిస్టు ఈ వ్యవహారం గురించి వ్యాఖ్యానించాడు. నిజానికి ఛానల్ అంతరంగానికి ఈ వ్యాఖ్య దర్పణం. కీచులాడుకోవడం ఇష్టం లేకపోతే మరుక్షణమే లైవ్ కట్ చేయించవచ్చు. లైవ్ కట్ చేస్తానంటూ కొనసాగించడం విశేషం.
ఈ ధోరణికి కేవలం యాంకర్ మాత్రమే బాధ్యుడు కాదు. దీన్ని ఛానల్ ఎడిటోరియల్ పాలసీగా పరిగణించాలి. లేకపోతే గంటతర్వాత మొత్తం పునఃప్రసారం చేయరుకదా. తర్వాతి రోజు తమ కార్యక్రమ ఫలితంగా ఫలానా సంఘటన జరిగిందని చాలాసార్లు ప్రకటించుకున్నారు.
రాజకీయ నాయకులు ఈ స్థాయిలో మాట్లాడటం తగదు. వీరికెంత బాధ్యత ఉందో ప్రజాస్వామ్యం, భావస్వేచ్ఛ అని చెప్పుకునే ఛానళ్ళకు ఇంకా ఎక్కువ ఉంది. అంతేకానీ వారు మాట్లాడారని వీరు, వీరు చూపారని వారు అనే రీతిలో మాట్లాడుకోవడం నిష్ప్రయోజనం. వీక్షకులు కూడా ఈ విషయం వదలి వారు ఎలా తిట్టుకుంటున్నారో చూడాలని ఉబలాట పడుతున్నారు. ఇది విషాదం!
డా. నాగసూరి వేణుగోపాల్