న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని నియమించింది. అధికరణ 370 రద్దుపై దాఖలైన పిటిషన్ల విచారణను అక్టోబర్ 1నుంచి సుప్రీం కోర్టు విచారించనుంది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో చాలా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ సజ్జత్ లోన్ తోపాటు పలువురు ఉన్నారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని గత ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ గా విభజించారు. జమ్మూ కాశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ ను పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రోజునే పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. చట్టసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి రామ్ నాత్ కోవింద్ ఆగస్ట్ 9న విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలతోపాటు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారు ఇప్పటికీ గృహ నిర్భందంలోనే ఉన్న సంగతి తెలిసిందే.