హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘మహిళా సంకల్ప దీక్ష’ చేస్తున్నారు. రెండురోజులపాటు దీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళలు, చిన్నారుల భవిష్యత్ గురించి సీఎం కేసీఆర్ ఆలోచించాలని సూచించారు. తాగొచ్చిన భర్తలను ఇంట్లోకి రానివ్వమని మహిళలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. మద్యం వల్లే దిశ, మానస, సమతలపై అత్యాచారాలు జరిగాయని చెప్పారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. అనేక కుటుంబాలు మద్యం వల్లే ఆర్థికంగా చితికిపోతున్నాయని, గ్రామల్లో బెల్టు షాపులు పెరిగిపోతున్నా.. సీఎంకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. మద్యంపై ప్రభుత్వానికి ఏడాదికి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. మద్యంపై వస్తోన్న ఆదాయం ద్వారానే ప్రభుత్వాన్ని నడపటం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రాంగా కేసీఆర్ మార్చారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారని, అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మద్యం తాగిన భర్తలు..తమ భార్య, పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం వైపు అడుగులు వేయడం శుభపరిణామని చెప్పారు. యువత మద్యానికి బానిసలు కావడం బాధాకరమన్నారు. యువతను పెడదారి పట్టిస్తోన్న పబ్లు, క్లబ్లను నిషేధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్య నిషేదంపై పోరాటాన్ని బీజేపీ ముందుండి నడిపిస్తోందని చెప్పారు.