(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ అధికార పక్ష సభ్యులు ప్రసంగించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియానికి టిడిపి వ్యతిరేకం కాదని చెప్పారు. సిఎం జగన్ వల్లే ఇంగ్లీషు మీడియం వచ్చిందనడం సరికాదని అన్నారు.ఇంగ్లీషు మీడియాన్ని తామే ప్రమోట్ చేశామని తెలిపారు. మీరే ఇంగ్లీషును కనిపెట్టినట్లు మాట్లాడవద్దని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడితే మీరే (వైసిపి) వ్యతిరేకించారని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో మాతృభాషకు మంగళం అంటూ సాక్షి పత్రికలోనే కథనాలు వచ్చాయన్నారు. మీరు చేస్తే రైటు, మేము చేస్తే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం ఎప్పుడూ అవకాశ వాద రాజకీయాలు చేయదని అన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కల్పించుకొని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దమ్ము ధైర్యం, నిజాయితీ, సిగ్గు ఉంటే తాను ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించినట్లు చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు పాంప్లేట్ పేపరు ఈనాడులో వచ్చిన వార్తలపై ఇక్కడ చర్చ జరిగితే అంతే ఉండదని అన్నారు. వారికి అనుకూలమైన పేపర్లు, ఛానల్స్ ఉంటాయి అదే మాదిరిగా ఇటు పక్కమాకు అనుకూలమైన పేపర్లు, ఛానల్ ఉంటాయని జగన్ అన్నారు. పేపరులో వచ్చిన వార్తలు పట్టుకుని తాను వ్యతిరేకించినట్లు మాట్లాడటం ఏమిటంటూ జగన్ విరుచుకుపడ్డారు. ప్రతి పేదవాడి పిల్లలకు ఇంగ్లీషు మీడియం అందించాలన్నది తమ తాపత్రయమన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి అసత్యప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ మీ పేపరుకు విశ్వసనీయత లేదా, అది చెత్త పేపరా, మాకు బుద్ది, జ్ఞానం లేదని అంటున్న ఆయన పేపరుకు బుద్ది, జ్ఞానం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాతృభాషను త్యాగం చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్కి ఆప్షన్ ఇవ్వాలన్నారు. వారికి ఏ మీడియం కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.