అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందనీ బిజెపి జాతీయ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపిలో కాంగ్రెస్లో ఇప్పటికే ఖాళీ అయిపోయిందనీ, ఇక టిడిపి వంతు వచ్చిందని ఆయన అన్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద విజయం సాధించి 303 సీట్లను కైవసం చేసుకోవడంలో కార్యకర్తల కృషి, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ రాహుల్ గాంధీ పార్టీని నడపలేనంటూ పలాయనం చిత్తగించారనీ చౌహాన్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని చౌహాన్ విమర్శించారు.
రాష్ట్రంలో టిడిపి నుండి వలసలు కొనసాగుతాయని చౌహాన్ అన్నారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కుటుంబ పార్టీల చరిత్ర ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సబ్కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని చౌహాన్ అన్నారు. పార్టీ శ్రేణులు అందరూ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని చౌహాన్ సూచించారు. ఏపిలో 25లక్షల నూతన సభ్యులను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చౌహాన్ పేర్కొన్నారు.