తిరుమల: టీటీడీలో వంశపారంపర్య అర్చకుల పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరు అభినందనీయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి గుర్జర్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సుబ్రహ్మణ్య స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో ఆడిటింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని అన్నారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలకు లెక్కలు లేవన్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే ప్రతీ కానుకకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందన్నారు. టీటీడీలో ఆడిటింగ్ స్వయంగా నిర్వహించాలని.. టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని సూచించారు. గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరగాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. రమణ దీక్షితులును తిరిగి ప్రధాన అర్చకుడిగా తీసుకోవడం శుభపరిణామని చెప్పారు.
జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తోందని సుబ్రమణ్యస్వామి అన్నారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. చైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్థుడన్న ప్రచారం కూడా అవాస్తవమన్నారు. టీటీడీపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే స్పందిస్తానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.
కాగా, గత తెలుగుదేశం ప్రభుత్వం అర్చకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు కుదించగా, టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులను ఆ పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, రమణ దీక్షితులు ఆలయంలో గౌరవ ప్రధానార్చకునిగా తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం(డిసెంబర్ 28) జరిగిన పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు.