(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకుంటుందా ? ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి ? ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉంటారా ? లేక సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు చేసిన వారికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా ? అనే ప్రశ్నలు కర్ణాటక బీజేపీ నాయకుల్లో ఉత్పన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కనీసం ఏడు స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలు బీజేపీకి చావోరేవోలా మారాయి. మొత్తం 223 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ బలం 106. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సభ్యుల సంఖ్య 112. మేజిక్ ఫిగర్ దాటాలంటే బీజేపీ మరో ఆరుగురు సభ్యులు అవసరం. ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటేనే యడియూరప్ప సర్కార్ మనుగడ కొనసాగిస్తుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలేవీ బీజేపీకి కావు. ఫార్టీ ఫిరాయించిన సిటింగ్ ఎమ్మెల్యేలను జనం ఎంతమేరకు ఆదరిస్తారన్నదానిపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. దీంతో ఉపఎన్నికల్లో గెలవడానికి అధికార బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది.
మరోవైపు తమ స్థానాలే బీజేపీ లాక్కున్నందున ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, విజయం తమదేనని విపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం వారందరూ అధికార బీజేపీలో చేరి ఆపార్టీ టికెట్ పై పోటీకి దిగారు. అయితే, అత్యధిక స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గెలుచుకోగలిగితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆ కూటమికి దక్కుతుంది. దీంతో ఈ ఉపఎన్నికలు యడియూరప్ప ప్రభుత్వానికి అగ్ని పరీక్షలా మారాయి. ప్రభుత్వం ఉంటుందా ? లేక మహారాష్ట్ర తరహాలో కర్ణాటకలోనూ అధికారం చేజారుతుందా ? అన్నది బీజేపీని టెన్షన్ పెడుతోంది.
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 17 మంది శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో ఈ ఏడాది జూలైలో జేడీ(ఎస్)- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో 17 మందిపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు చేశారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో వీరు మళ్లీ పోటీ చేస్తున్నారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా అందులో మస్కీ, రాజరాజేశ్వరి నియోజకవర్గాల ఎన్నికకు సంబందించిన పిటిషన్ హైకోర్టు విచారణలో ఉండటంతో 15 అసెంబ్లీ స్థానాలకే ఉప ఎన్నిక జరుగుతున్నది. 15 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపఎన్నికల ఫలితాలు డిసెంబర్ 9వ తేదీన వెల్లడిస్తారు. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది.