(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి ప్రజా రాజధాని అని, భావితరాల భవిష్యత్కు ప్రతీక అని తెలిపారు. ప్రపంచంలోని ఐదారు గొప్ప నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తయారు చేయాలని భావించానన్నారు. రాజధాని ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఆదాయాన్ని సమకూర్చే నగరం అమరావతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నాడు తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు తమపై నమ్మకంతో భూములు ఇచ్చారని గుర్తుచేశారు. రైతులు త్యాగాలు చేసి రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. అమరావతిలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి, రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే తాను పర్యటించానని తెలిపారు. రైతులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వస్తే తనపై దాడి చేస్తారా ? ప్రశ్నించారు. వైసీపీ రౌడీలను పంపించి దాడులు చేయించారని చంద్రబాబు విమర్శించారు. తన మీదే దాడులు చేస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డీఎస్పీ సమక్షంలోనే రాళ్లు, చెప్పులు విసిరారన్నారు. తాను ప్రజా రాజధానిని సందర్శించడానికి వచ్చానని.. యుద్ధం చేయడానికి రాలేదని తెలిపారు.
తనను కులానికి అంటగట్టే పరిస్థితికి దిగజారారని మండిపడ్డారు. ఒకే సామాజికవర్గం కోసం పని చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, తనకు సామాజికవర్గం ముఖ్యం కాదని, తెలుగుజాతి ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆనాడు హైదరాబాద్ను కులం కోసం అభివృద్ధి చేయలేదన్నారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే పనిచేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి పేరు చెబితే.. తానే గుర్తొస్తానన్నారు. తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ.. హైదరాబాద్కు నష్టం చేయాలని ఆలోచించలేదని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో అమరావతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ఏ ప్రాంతానికైనా అమరావతి సమాన దూరంలో ఉంటుందన్నారు. రాజధానిపై వైసీపీ నేతలే కోర్టుకు వెళ్లారని.. రైతులెవరూ వెళ్లలేదని తెలిపారు. రాజధాని కోసం రూ.9,060 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చిందని, రాజధానికి రూ.55 కోట్లు విరాళాలు వచ్చాయని చంద్రబాబు వివరించారు. అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదన్నారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.