(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉద్దండరాయపాలెంలో రాజధానికి భూమిపూజ చేసిన ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉద్ధండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఆ ప్రాంత మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం ఆపడమంటే 33వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులను అవమానించడమేనని చంద్రబాబు పేర్కొన్నారు. అక్కడి నుంచి రైతులతో కలిసి శంకుస్థాపన స్థలానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడి శిలాఫలకాలు పరిశీలించారు. భూమిపూజ చేసిన ప్రదేశం, రాజధాని నమూనాలు చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.
12.00:గంటలకు ముందు
రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెంకటపాలెం వద్ద ఒక వర్గానికి వారు నిరసన తెలియజేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఒక వర్గానికి చెందిన వారు చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తుండగా మరోక వర్గం ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో వెంకటపాలెం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు, రైతులకు మద్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మొహరించి నిరసనకారులను పక్కకు తప్పించారు. చంద్రబాబు వస్తున్న బస్సుపై ఒక వ్యక్తి చెప్పు విసిరివేయడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు, చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వడంతో బస్సు అద్దం పగిలింది. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆపై రోప్ పార్టీని రంగంలోకి దించి కాన్వాయ్ ముందుకు సాగేందుకు సహకరించారు.బాబు ప్రయాణిస్తున్న బస్సు మినహా, మిగతా టిడిపి నాయకుల వాహనాలను వెంకటపాలెంలోకి అనుమతించేది లేదని పోలీసు అధికారులు చెప్పడంతో పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు.
10.30:గంటలకు ముందు
అమరావతిలోని నిర్మాణాలను టీడీపీ నేతలతో కలిసి ఆపార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు పర్యటను అడ్డుకుంటామని రాజధాని రైతులు హెచ్చరించిన నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా, వాటిని దగ్గరుండి పోలీసులు కట్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం చంద్రబాబు వ్యతిరేక బ్యానర్లతో నిండిపోయింది. వాణిజ్య స్థలాల విషయంలో చంద్రబాబు రైతులను మోసం చేశారని, మళ్లీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని బ్యానర్లపై రాశారు.