అమరావతి: వినాయకచవితి సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరిట దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరంలో వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవికి జరిగిన అవమానాన్ని సుచరిత ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. రాష్ట్రంలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితి తలెత్తవద్దని చెప్పారు. బడుగు,బలహీన వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లే వాతావరణం ఉండాలని సూచించారు. మహిళలు ఏ పార్టీకి చెందిన వారైనా, ఇలాంటి అవమానం జరగడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. బాధపడవద్దంటూ ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పారు. ఘటనలో బాధ్యులెవరూ తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి సుచరితను ఆదేశించారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో ఏర్పాటు వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు దాడికి దిగిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడికి సమీపంలోనే వినాయక మంటపం ఉండటంతో.. స్థానిక వైసీపీ అధ్యక్షుడి విన్నపం మేరకు అక్కడకు వెళ్లారు. వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనై శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనపై తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.