(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా.. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ గురువారం(నవంబర్ 22) నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఏదైనా ప్రకటన చేస్తారని అంతా భావించారు. అయితే, శుక్రవారం రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆర్టీసీపై ఐదు గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో.. ఆర్టీసీ అప్పులను భరించే స్థితిలో ప్రభుత్వం లేదని, ఆర్టీసీని యథాతథంగా నడపటం సాధ్యం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్టీసీలో రూట్ల ప్రయివేటీకరణపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు.. ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కార్మికుల ఉద్యోగాలకు ఇబ్బందిని కలిగించకుండా కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ రూ.5 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోగా.. జీతాల చెల్లింపునకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పుడు ఉన్నట్టుగానే ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు అవసరం. కానీ సంస్థకు అంత ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం కూడా పూర్తిగా సాయం చేసే స్థితిలో లేదు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవకాశం ఉందని సమీక్షలో సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం.
ఆర్టీసీకి ఇప్పటికే ఐదు వేల కోట్లకుపైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉన్నాయి. పీఎఫ్ అధికారుల ఆదేశం మేరకు.. కార్మికులకు సెప్టెంబర్కు సంబంధించిన మొత్తం జీతం చెల్లించాలంటే రూ. 240 కోట్లు కావాలి. సీసీఎస్కు రూ. 500 కోట్లు ఇవ్వాలి. వీటికి తోడు డీజిల్, రెండేళ్లుగా ఉన్న రవాణా పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక కాలం చెల్లిన బస్సుల స్థానంలో 2,600 వందల కొత్త బస్సులు కొనాల్సి ఉంది. పీఎఫ్ బకాయిల కింద నెలకు రూ. 65 నుంచి రూ. 70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటిని.. ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సమీక్షలో తేల్చారు. ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేసినా.. నష్టాల నుంచి బయటపడే అవకాశం లేదన్నారు.
ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సులు, అద్దె బస్సులు, ప్రయివేట్ ట్రావెల్స్తో.. ఆర్టీసీకి నష్టాలు తగ్గుతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5,100 రూట్లలో ప్రయివేట్ బస్సులు నడవడానికి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. అయితే, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు వెలువరించే తీర్పుపైనే.. ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంది.