అమరావతి: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నానిల వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ ఆపార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. తనకు, వల్లభనేని వంశీకి రాజకీయ బిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆరే అని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమన్నారు. వంశీ, తాను బయటకు వచ్చేశామని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీని అప్పగిస్తారా అని కొడాలి నాని ప్రశ్నించారు.
ఇక తిరుమల శ్రీవారిపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తాను చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని… నీ అమ్మ మొగుడు ఖర్జూర నాయుడు కట్టించాడా అని అన్నానని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే దాన్ని తీసుకెళ్లి టీటీడీకి అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లడం ఇది మొదటిసారి కాదన్నారు. దీనిపై చంద్రబాబు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని, రాజకీయ రంగు పులిమేందుకు రకరకాల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవాలంటే బీజేపీ, టీడీపీ ప్రాథమిక సభ్యత్వాలు తీసుకెళ్లాలా అని ప్రశ్నించారు. పప్పు, చంద్రబాబులకు కమీషన్లు ఇవ్వడమే దేవినేని ఉమా మహేశ్వరరావు పని నాని ఆరోపించారు.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ను వాడుకుంది కొడాలి నాని, వంశీలే అని టీడీపీ సీనియర్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. వీళ్ల టికెట్స్ కోసం స్వార్థంతో ఎన్టీఆర్ను వాడుకున్నారని విమర్శించారు. వీరి కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. చంద్రబాబు నాయుడు వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లు ఈ స్థాయిలో ఉన్నారని, రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిని ఇలా విమర్శిస్తారా అంటూ టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.