అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సున్నా వడ్డీ రుణాలపై నిన్న జరిగిన వాగ్వివాదం నేడు కూడా కొనసాగింది. రైతులకు టిడిపి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు టిడిపి సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన ప్రసంగం కొనసాగకుండా అడ్డుకున్నారు.
పదేపదే అడ్డు తగులుతున్న టిడిపి సభ్యులను చూసి ఒక దశలో ముఖ్యమంత్రి సంయమనం కోల్పోయారు. తీవ్ర ఆగ్రహంతో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి, ‘మీకు 20 మంది ఉన్నారు. మాకు 150 మంది ఉన్నారు. మావాళ్లు లేస్తే మీరు అక్కడ కూర్చోలేరు’ అన్నారు.
‘బుద్ధీజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతామనుకున్నారా. ఎవరూ భయపడరు. పక్షులం అనుకున్నారా. ఎట్లాంటోళ్లను తయరు చేశారయ్యా. అందరూ రౌడీలు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి ‘పర్సనాలిటీ పెరగగానే సరికాదు, బుర్ర పెరగాలి’ అన్నారు.
ఈ అంశంపై సభలో టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించడంతో చర్చ మొదలయింది. ముందు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతున్నపుడు ఈ గంగరగోళం జరిగింది. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సభలో ఇంకా గంగరగోళం నెలకొన్నది.