ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటల్లోగా పవార్ ప్రభుత్వ ఏర్పాటుపై సన్నద్ధతపై గవర్నర్కు ఏదో ఒక సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పవార్ సమావేశమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తోనూ చర్చలు జరపనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమష్టిగానే తీసుకుంటామని, కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఎన్సీపీ నేత అజిత్ పవార్ చెప్పారు. సోమవారంనాడు కూడా ఎదురుచూసినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదని, కాంగ్రెస్ నుంచి స్పష్టత రాకుండా తామొక్కరమే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలున్నా కలిసి చర్చించుకుని, కలిసికట్టుగా ముందుకు వెళ్తామని అజిత్ పవార్ తెలిపారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఛాతి నొప్పితో లీలావతి ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ ఈ రోజు ఉదయం ఆయనను పరామర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో సోమవారం పార్టీ నేతలు పలు దఫాల్లో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు కూడగట్టేందుకు శివసేన చేసిన ప్రయత్నాల్ని నిశితంగా గమనించింది. అయితే, బీజేపీ పార్టీ వర్గాల్లో మాత్రం రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించదని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన అనివార్యం. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సంవత్సరానికి మించి నిలబడదని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుపై సోనియాతో ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు. తొలుత ప్రభుత్వ ఏర్పాటుపై చేయాల్సిందిగా 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించాగా.. తాము ప్రభుత్వ ఏర్పాటు చేయలేమని ఆపార్టీ గవర్నర్ కు తెలియజేసింది. దీంతో 56 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు బలాన్ని, సమ్మతిని తెలియజేయాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మరింత గడువు కోరగా.. అందుకు గవర్నర్ తిరస్కరించారు. ఇక 54 స్థానాలతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, శివసేన సహకారం ఎన్సీపీకి తప్పనిసరి. ఈ పరిమాణాల నేపథ్యంలో ఇవాళ రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే సీఎం పదవిని 50-50 ఫార్ములా కింద చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని శివసేన చేసిన ప్రధాన డిమాండ్ను బీజేపీ నిరాకరించడంతో గత 20 రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.