అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ చేసిన ప్రాంతం రాజధానికి అనువైంది కాదని బొత్స మరో సారి స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన మరో సారి రాజధాని విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ నిర్మాణాలకు అక్కడి భూములు పనికిరావని తేల్చిచెప్పారు. అమరావతి ప్రాంతంలో సమీకరించిన భూముల అభివృద్ధికి ఎకరాకు కోటి రూపాయల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. లే అవుట్లు, రోడ్ల నిర్మాణానికే 32వేల కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు. 33 వేల ఎకరాలకు 32వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే ఎకరాకు సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతున్నట్లైకదా అని బొత్సా పేర్కొన్నారు.
నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని బొత్స తెలిపారు.
మరో పక్క రాజధానిలోని స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుండి వైదొలగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుండి వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. దీనిపై సోమవారం రాత్రి ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బొత్స వ్యాఖ్యల పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడుతున్నారు. 2014లో అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రాజధానికి అంగీకరించాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు రాజధానిని మార్చే అధికారం కమిటికి ఎక్కడిదని ఆయన ప్రశ్నిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ తీరు కారణంగా పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయని లోకేష్ అన్నారు.