చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై చెన్నైలో కేసు నమోదైంది. ఈ నెల 14న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ‘తుగ్లక్’ పత్రికా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన రజనీ.. ద్రావిడ ఇయక్కం నాస్తికుడు తందై పెరియార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ద్రావిడ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్పై ఐపీసీ 153 సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోయంబత్తూరుకు చెందిన ద్రవిడార్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ నెల 14న చెన్నైలో జరిగిన ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో సేలంలో ద్రావిడ పితామహుడు తందై పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని ఆరోపించారు. రజనీ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కళగం(డీవీకే) నేతలు మండిపడ్డారు. పెరియార్ ర్యాలీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్ను కించపరిచిన రజనీకాంత్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్ విడుదలై కళగం అధ్యక్షుడు నెహ్రూదాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.