అమరావతి: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బిజెపి హవా నడుస్తోందనీ, అయితే ఇది ఎల్లకాలమూ ఉండదనీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. ఒక టివి ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నరేంద్రమోది, అమిత్షాలు అత్యంత కఠిన రాజకీయ నాయకులనీ, తామనుకున్నది చేసుకుంటూ వెళ్లడమే తప్ప వారికి మరొకటి తెలియదనీ ఉండవల్లి అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, దాన్ని దేశ ప్రజలను ఒప్పించగలిగారనీ, ఈ పని మరొకరికి నాధ్యమయ్యేది కాదనీ ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బిజెపి కేంద్రంలో ఉంటే అసాధ్యమని ఉండవల్లి అన్నారు.
తన మిత్రుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్ ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషమని అన్నారు. జగన్ వద్ద ఉండేందుకు గానీ, సలహాదారుడిగా తాను పనికి రానని ఉండవల్లి వ్యాఖ్యానించారు. జగన్ పాలన మొదలై అయిదు నెలలు మాత్రమే అయినందున ఇంత స్వల్ప కాలానికే పాలనపై అభిప్రాయం వ్యక్తం చేయడం సరికాదని ఉండవల్లి పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడుగా మారారని అన్నారు. అయితే ఆయన చంద్రబాబుకు దగ్గరగా ఉన్నారని ప్రజలు నమ్మడం వల్లనే ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్లు, సీట్లు దక్కలేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తాను ఏ పార్టీలో, ఎవరి పక్షాన లేననీ, వివిధ అంశాలపై మాత్రం స్పందిస్తాననీ ఉండవల్లి పేర్కొన్నారు.