న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిప్తతిని కల్పిస్తున్న భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370 ని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు.
దేశమంతటా ఉన్న కేంద్ర బలగాలకు, ప్రత్యేకించి జమ్ము కశ్మీర్లో ఉన్న బలగాలకు హైఎలర్ట్ సందేశాలు వెళ్లాయని కేంద్ర హోశాఖ వర్గాలు తెలిపాయి. అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ, తమతమ స్థావరాల దగ్గర, జవాన్ల తరలింపు అవసరమైన చోట తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని హోంశాఖ కోరింది.
ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
జమ్ము కశ్మీర్ను విభజించడానికి ఉద్దేశించిన ఒక బిల్లును కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రకారం లద్దాఖ్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. మిగిలిన జమ్ము కశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుంది గానీ దానికి అసెంబ్లీ ఉంటుంది. లద్దాఖ్ మాత్రం అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.