(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో పోలీసులు వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఎన్ కౌంటర్ జరిగి రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. ఇప్పటికే ఆ మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు ఎంతో ఖరీదైన ఇంజెక్షన్స్ ఇచ్చి.. ఎంబామింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోతోంది. బాడీలకు ఎంబామింగ్ చేస్తే.. దాదాపు రెండు వారాల పాటు చెడిపోకుండా ఉంటాయి. అయితే, రీ పోస్టుమార్టానికి అవకాశం ఉండదు. ఎంత శీతల ప్రదేశంలో ఉంచిన అవి వారానికే ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రోజులు గడుస్తుండటంతో బాడీల నుంచి దుర్వాసన వస్తోంది. ఇలా మరో రెండు రోజులు గడిస్తే.. బాడీలు ఎందుకీ పనికిరాకుండా పోతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మృతదేహాలను ఢిల్లీకి తరలిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అక్కడైతే అధునాతన సౌకర్యాలతో ఉన్న మార్చురీలు ఉన్నాయంటున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
దిశహత్య కేసు నిందితులు ఈ నెల 6న ఎన్కౌంటర్లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్ అనంతరం మృతదేహాలకు మహబూబ్నగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను హైదరాబాద్లోని గాంథీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎన్కౌంటర్పై విచారణకు ముగ్గురు రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ను ఏర్పాటు చేసింది. అలాగే డెడ్బాడీలను భద్రపరచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.