Photo Courtesy: Indian Navy
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికన్ డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిన దరిమిలా గల్ఫ్లో యుద్ధమేఘాలు అలముకున్న వేళ భారత్ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒమన్ సింధుశాఖలో, గల్ఫ్ సింధుశాఖలో సంచరించే భారత రవాణా నౌకల భద్రత కోసం నౌకాదళాన్ని వినియోగించింది.
తమ గగనతలంలోకి ప్రవేశించిన కారణంగానే అమెరికా డ్రోన్ను కూల్చివేశామని ఇరాన్ వాదిస్తున్నది. అమెరికా దానిని ఖండిస్తున్నది. ఇరాన్పై దాడికి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, దానిలో 150 మంది ప్రాణాలు కోల్పోతారని అధికారులు వివరించడంతో పది నిముషాల ముందు దాడిని ఆపించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. మరోపక్క ఎలాంటి దాడికైనా దీటుగా జవాబిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
గల్ఫ్లో సంచరించే భారత వాణిజ్య నౌకల భద్రత కోసం ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభించినట్లు నౌకాదళం ప్రకటించింది. గల్ఫ్లో నెలకొన్న పరిస్థితులకు ఇండియానే కాక ఇతర దేశాలు కూడా స్పందించాయి. శుక్రవారం నాడు బ్రిటిష్ ఎయిర్వేస్, కతార్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ వంటి సంస్థలు హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే అన్ని విమాన సర్వీసులనూ రద్దు చేశాయి.