ఇంటిమీద పడిన అరుదైన క్షిపణి
వెంటనే దీటుగా ఇజ్రాయెల్ స్పందన
కాల్పుల విరమణ జరిగిందన్న హమాస్
గాజా సిటీ: అరుదైన క్షిపణి ఒకటి టెల్ అవివ్ నగరంలోని ఒక ఇంటిపై వచ్చి పడటంతో ఇజ్రాయెల్ మండిపడింది. గాజా స్ట్రిప్ పొడవునా పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన హమాస్.. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్ లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం రెండు వారాల ముందు క్షిపణి దాడి జరగడంతో ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహానికి గురై దీటుగా స్పందించింది. వెంటనే ఈజిప్టు సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నట్లు హమాస్ ప్రకటించింది. వాషింగ్టన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇజ్రాయెలీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కలిసిన సమయంలోనే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడం విశేషం.
ఈజిప్టు ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని, కాల్పుల విరమణ కుదిరిందని హమాస్ ప్రతినిధి ఫౌజీ బర్హౌమ్ తెలిపారు. హమాస నాయకుడి కార్యాలయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ లక్షిత దాడులు చేయడంతో హమాస్ దిగివచ్చింది. పాలస్తీనా నుంచి వచ్చిన ఒక క్షిపణి ఉత్తర టెల్ అవివ్ ప్రాంతంలో ఒక ఇంటిపై పడి ఏడుగురు గాయపడ్డారు. ఆ తర్వాత మళ్లీ రాత్రి సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా హమాస్ వైపు నుంచి వరుసగా రాకెట్లు వచ్చి పడ్డాయి. దాంతో దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో సైరన్లు చాలాసేపు మోగుతూనే ఉన్నాయి. దాడుల్లో ఏడుగురు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. అయితే, కార్యాలయంపై దాడి జరిగినప్పుడు హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా అక్కడున్నారో లేదో తెలియడం లేదు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కు కలిగి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ట్రంప్ తో సమావేశం ముగిసిన తర్వాత ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకున్న నెతన్యాహు వెంటనే స్వదేశానికి బయల్దేరారు.