అమరావతి: నా అవసరం పార్టీకి ఉంటుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావించే వరకూ జనసేనలోనే ఉంటాను అని సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పార్టీ మారనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను జనసేనలోనే నడుస్తాను అని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న పుకార్లు షాక్కు గురి చేశాయన్నారు. ద్వేషించేవాళ్లు పుకార్లు పుట్టిస్తే, వాటిని మూర్ఖులు ప్రచారం చేస్తారని ఆయన దుయ్యబట్టారు. వాటిని ఇడియట్స్ మాత్రమే అంగీకరిస్తారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వీటిలో వారు ఏ కేటగిరికి చెందిన వారో వారే నిర్ణయించుకోవాలని వివి అన్నారు. పుకార్లు పుట్టించడం మానుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించడం, మొక్కలు నాటడం, యువతను చైతన్యపర్చడం లాంటి కార్యక్రమాలపై దృష్టి పెడితే మంచిదని లక్ష్మీనారాయణ హితవు పలికారు.
(17.00గంటలు) అంతకు ముందు:
సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్బై చెప్పి బిజెపిలో చేరనున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బిజెపి నేతలతో సంప్రదింపులు జరిపారనీ, పార్టీలో చేరడం లాంఛనమేనని అంటున్నారు. లక్ష్మీనారాయణ ఈ వదంతులపై బహిరంగంగా వివరణ ఇవ్వలేదు కానీ ఇది తప్పుడు ప్రచారం అని పార్టీ శ్రేణులకు తెలియజేశారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించడంతో లక్ష్మీనారాయణ రాష్ట్రంలో పాపులర్ అయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో లక్ష్మీనారాయణ తన ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. దానితో ఆయన సొంతంగా పార్టీ పెడుతున్నారనీ, టిడిపిలో చేరతారనీ, బిజెపిలో చేరుతున్నారనీ రకరకాలుగా ప్రచారం జరిగింది. లోక్సత్తా పార్టీని నడిపించే బాధ్యతపై జయప్రకాష్ నారాయణతో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్నికల సమయంలో లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ విశాఖ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి తరువాత ఒకటి రెండు సందర్భాలలో మినహా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని సమాచారం.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన పోలిట్ బ్యూరో, పొలిటికల్ ఎఫైర్స్ కమిటిలో లక్ష్మీనారాయణకు అవకాశం దక్కలేదు. అప్పుడే లక్ష్మీనారాయణ పార్టీ వీడనున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై పార్టీ అధినేత పవన్ గానీ లక్ష్మీనారాయణ ఎక్కడా స్పందించలేదు. అయితే లక్ష్మీనారాయణ తన సన్నిహితుల వద్ద జనసేన పార్టీని వీడి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పినట్లు సమాచారం. లక్ష్మీనారాయణతో పాటు విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన గంపల గిరిధర్, మరి కొందరు బిజెపిలో చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాలపై లక్ష్మీనారాయణ నేరుగా స్పందించలేదు గానీ పరోక్షంగా ఖండించారు. జనసేన పార్టీ నాయకులు ఆయనతో ఛాటింగ్ చేయగా దానిలో నిజం లేదనీ, బిగ్ రూమర్ అంటూ లక్ష్మీనారాయణ కొట్టిపారేశారు. అదే విధంగా జనసేన శతాగ్ని టీమ్ ‘అవగాహన రాహిత్యంతో, ఇష్టానుసారంగా రాసే మీడియా వార్తలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలపై, అన్యాయాలపై జరిగే పోరాటాన్ని ఇలాంటి తప్పుడు వార్తలు ప్రభావితం చేయలేవు.’ అంటూ చేసిన ట్వీట్ను లక్ష్మీనారాయణ రీట్వీట్ చేశారు.