న్యూఢిల్లీ: కర్నాటకలో బిజెపికి అనుకూలంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారి అనర్హత కొనసాగుతుంది కానీ, వారు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ 17మంది శాసనసభ్యుల తిరుగుబాటు కారణంగానే కర్నాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్) – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి యదియూరప్ప నాయకత్వంలోని బిజెపి సర్కారు అధికారంలోకి వచ్చింది.
ప్రజాస్వామ్యంలో నైతికత అన్నదానికి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం విలువ ఇవ్వాల్సిందేనంటూ, సుప్రీంకోర్టు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నది. అయితే ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2023లో ముగిసేవరకూ వారు ఎన్నికలలో పోటీ చేయరాదన్న అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యేలపై స్పీకర్ జూలై నెలలో అనర్హత వేటు వేశారు. తాము రాజీనామా చేశాం కాబట్టి తమపై అనర్హత వేటు వేయడమే కుదరదని రెబల్ శాసనసభ్యులు వాదించారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల వారు డిసెంబర్ అయిదున జరగనున్న ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు మార్గం సుగమం అయింది. 17 సీట్లకు గాను 15 సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
రెబల్ శాసనసభ్యులను బిజెపి అభ్యర్ధులుగా పోటీలో దింపే అవకాశం ఉంది. వారి కారణంగానే తమ ప్రభుతం ఏర్పడిందనీ, వారిని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ ముఖ్యమంత్రి యదియూరప్ప తమ పార్టీ నాయకులతో చెబుతున్న వీడియో రికార్డింగ్ ఇటీవల బయటకు వచ్చింది. ప్రస్తుతం 224 సీట్ల సభలో ప్రస్తుతం బిజెపికి 106 మంది మద్దతు ఉంది. జెడిఎస్ – కాంగ్రెస్ సంకీర్ణానికి 101 మంది సభ్యులు ఉన్నారు. యదియూరప్ప ప్రభుత్వం కొనసాగాలంటే ఉపఎన్నికలు జరిగే 15 స్థానాలలో కనీసం ఆరు సీట్లలో విజయం సాధించాలి.