(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణ ఆర్టిసి కార్మికుల సమ్మె ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టను మసకబారుస్తున్నదా? ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత వరుసగా రెండవ సారి మంచి మెజారిటీతో అధికార పీఠం అధిష్టించిన కెసిఆర్ మొండితనంతో తనకు తానే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారా? పది రోజుల క్రితం ప్రారంభమైన ఆర్టిసి సమ్మె ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో ఈ ప్రశ్నలు వినబడుతున్నాయి.
ఆర్టిసి కార్మికుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి చాలా కఠినమైన వైఖరి తీసుకోవడం అధికారపక్షమైన టిఆర్ఎస్లోనే చాలా మందికి మింగుడు పడటం లేదు. అయితే టిఆర్ఎస్లో ముఖ్యమంత్రి వైఖరికి భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చే సాహసం ఎవరికీ లేదు. డ్యూటీలో చేరని ఉద్యోగులు అందరూ ‘సెల్ఫ్ డిస్మిస్’ చేసుకున్నారన్న కెసిఆర్ ప్రకటనను తెలంగాణ సమాజంలో చాలా మంది ఆయన అహంకారంగానే భావించారు.
సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అత్యధిక భాగం ఆర్టిసి కార్మికులను తప్పుపట్టేందుకు సిద్ధంగా లేరు. అయిదేళ్ల క్రితం సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టిసి కార్మికులు నిర్వహించిన పాత్రను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఆర్టిసి కార్మికుల సమ్మె పట్ల కెసిఆర్ తీసుకున్న వైఖరి చూసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం తెలిపే విషయంలో తాత్సారం ప్రదర్శించారు. దీనిపై ఆర్టిసి కార్మిక సంఘం నాయకుడు ఆశ్వద్ధామరెడ్డి స్పందించగానే ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అర్థం అయింది. దానితో ఉద్యోగ సంఘాలు దిగివచ్చాయి.
ఆర్టిసి కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతున్న కొద్దీ టిఆర్ఎస్ నాయకుల్లో గుబులు ఎక్కువవుతున్నది. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ప్రకటన దీనికి తార్కాణం. తాను సోషలిస్ట్ననీ, సమ్మెలను వ్యతిరేకించననీ ఆయన ప్రకటించారు. మరో పక్క తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. నిజానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక రకంగా అభశంసించాయి. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అని ప్రశ్నించారు ఆయన.
ఈ పరిమాణాలు అన్ని టిఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. కెసిఆర్ పాలన పట్ల వివిధ వర్గాలలో నెలకొన్న వ్యతిరేకత ఆర్టిసి కార్మికుల సమ్మె వేదికగా ఏకీకృతం అవుతున్న విషయాన్ని ఆ పార్టీలో చాలా మంది గుర్తించారు. వారి ఆందోళనకు అదే కారణం. ఈ పరిస్థితికి ప్రధాన కారణమైన ముఖ్యమంత్రి వైఖరిని తప్పుబట్టలేక లోలోపల విపరీతంగా మధనపడుతున్నారు.