హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యహారంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఏపీ సర్కార్ గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వమే తమ డేటాను చోరీ చేసిందని ఏపీ సర్కార్ ఎదురు దాడికి దిగింది.
ఈ వ్యహారంపై అటు కేటీఆర్.. ఇటు చంద్రబాబు, లోకేష్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.
‘మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం చంద్రబాబు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు చంద్రబాబు’ అంటూ మరో ట్వీట్ చేశారు.