అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్పై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ లోకేష్కు చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని అందరు అనుకుంటారని.. కానీలో అందులో నిజం లేదన్నారు. లోకేష్కు వైఎస్ రాజశేఖర్ రెడ్డే రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు. ‘మా అందరికీ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టాడని చెబుతాడు. కానీ లోకేష్కు రాజకీయ భిక్ష పెట్టిందెవరో తెలుసా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. లేదంటే లోకేష్ లాంటి వాళ్లు చట్టసభలకు ఎప్పుడొచ్చేవారు. ఎన్టీ రామారావు మండలిని రద్దు చేస్తే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ పునరుద్దరించింది. చట్టసభల్లో పెద్దలు ఉంటే బాగుటుందని ఆయన మండలిని తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు చెత్తనంత తెచ్చి మండలిలో కూర్చోబెట్టారు. మండలి లేకుంటే లోకేష్ ఎమ్మెల్యే ఎప్పుడయ్యేవాడు ? చంద్రబాబు లోకేష్ని ఏమీ చేయలేడు. లోకేష్కి చట్టసభల్లో అవకాశం కల్పించి మంత్రిని చేసిన ఘనత వైఎస్కే దక్కుతుంది” అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మండలిలో మేధావులు ఉంటే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారని వైఎస్ భావించారని.. కానీ చంద్రబాబు మాత్రం చెత్తను తీసుకొచ్చి పెట్టారని విమర్శించారు. శాసనమండలిలో ఎక్కువ మంది రాజకీయ నిరుద్యోగులు, రౌడీలు, గుండాలే ఉన్నారని ఆరోపించారు. సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు ఉండబట్టే.. చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులు.. రాజకీయ నిరుద్యోగులు అయ్యారని తెలిపారు. మండలిలో తమకు మందు వాసన వచ్చిందని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ కంటే శక్తివంతుడు ఎవరైనా ఉన్నారా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఆయన డిపార్ట్మెంట్లు తరలించాలనుకుంటే ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? అని సవాల్ విసిరారు. మహా అయితే మూడు నెలలు ఆలస్యం చేయగలరేమో.. అంతకుమించి ఇంకేమీ చేయ్యలేరని చెప్పారు.. జగన్ అనుకున్న పని చేయకుండా ఆపగలరా? అని సవాల్ చేశారు.
బుధవారం(జనవరి 22) శాసనమండలిలో గ్యాలరీలో కూర్చున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కూడా మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని, అన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు సీఎం జగన్ దెబ్బకు గ్యాలరీ ఎక్కారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈసారి, అసెంబ్లీలో గ్యాలరీకి చంద్రబాబు వెళ్లేలా చేయాలంటూ జగన్ ని కోరుతూ కొడాలి నాని అన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల వైసీపీ సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వులు చిందించారు.