(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన కారణంగా ఆ మార్పులను ప్రతిఫలిస్తూ కేంద్రం నేడు రెండు మ్యాపులు విడుదల చేసింది. వాటిలో అన్ని రాష్ట్రాల రాజధానులను ఎర్ర రంగులో మార్కు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ నగరాన్నీ చూపించలేదు.
వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగడంపై అనిచ్ఛిత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అవరావతి నిర్మాణానికి ప్రస్తుతానికి నిధులు అక్కరలేదని కూడా ముఖ్యమంత్రి జగన్ ఆ మధ్య ప్రధానిని కలిసినపుడు చెప్పారు. నిజానికి రాజధానిగా అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధాని శంఖుస్థాపన చేశారు. మరి కారణం ఏమిటో గానీ తాజాగా రూపొందించిన మ్యాపుల్లో నవ్యాంధ్ర రాజధాని లేకుండా చేశారు.
ఆంధ్రులకు ఎప్పుడూ రాజధాని సమస్యే. మద్రాసు మనదనుకున్నారు. తట్టాబుట్టా సర్దుకురావాల్సివచ్చింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన మద్రాసు నుంచి ఆంధ్రా విడిపోయిన తరవాత కర్నూలుకు పీట వేశారు. కొన్నాళ్లకు తెలంగాణ కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో హైదరాబాద్ను రాజధానిగా స్వీకరించి దానిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. 2014లో తెలంగాణ విడిపోవడంతో నవ్యాంద్రకు మరోసారి రాజధాని లేకుండా పోయింది.
2014 ఎన్నికలలో గెలిచి నవ్యాంధ్రలో మొదటి ప్రభుత్వం ఏర్పరచిన చంద్రబాబు మన రాజధాని అమరావతి అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని పెద్ద ఎత్తున భూసేకరణ చేసి పనులు మొదలుపెట్టారు.
ఇంతలో అయిదేళ్లు గడిచిపోయాయి. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి అధికారంలోకి వచ్చింది. రాజధానిగా అమరావతిపై ముందు నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వైఎస్ జగన్ అధికారంలోకి రావడం తోటే దానిని అనిచ్ఛితిలోకి నెట్టారు. ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజధాని వికేద్రీకరిస్తామంటారు. ఇంతవరకూ ఏదీ స్పష్టంగా చెప్పలేదు. డోలాయమానంగా తయారయిన అమరావతి ఆఖరికి మ్యాపుల నుంచి కూడా అదృశ్యమైపోయింది.