ఓవెన్లను నిషేధించిందంటూ వార్తాకథనాలు
పాటించకపోతే జైలు శిక్ష తప్పదని హెచ్చరిక
‘‘జపాన్ ప్రభుత్వం దేశంలో ఉన్న మైక్రోవేవ్ ఓవెన్లన్నింటినీ ఈ ఏడాది చివర్లోగా ధ్వంసం చేయాలని నిర్ణయించింది. పౌరులు, సంస్థలు అందరూ ఇలా చేయాలని, లేకపోతే జైలుపాలవుతారని హెచ్చరించింది’’ ఈ తరహా సందేశం ఒకటి ఫేస్ బుక్, ట్విటర్ లలో మోతెక్కుతోంది. జపాన్ ప్రభుత్వం మైక్రోవేవ్ ఓవెన్ల ఉపయోగాన్ని నిషేధించిందని, అందువల్ల కొత్త నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అందులో తెలిపారు.
అసలు ఇందులో నిజం ఎంతుందో తెలుసుకోవాలని వాట్సాప్ లో పలువురు వ్యక్తులు కోరారు.
అంతా అబద్ధం
జపాన్ ప్రభుత్వం మైక్రోవేవ్ ఓవెన్లను నిషేధించిందన్న తప్పుడు వార్త 2018 మే నుంచే ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. అమెరికాకు చెందిన నిజనిర్ధారణ వెబ్ సైట్ స్నోప్స్ ఈ విషయాన్ని తేల్చింది. రష్యాకు చెందిన ఒక సెటైర్ వెబ్ సైట్ నుంచి ఇది మొదలైందని గుర్తుపట్టింది. పలు స్పానిష్ వార్తా సంస్థలు ఈ సెటైరికల్ కథనాన్ని ప్రచురించాయి. ఆ తర్వాతే అది ఫేస్ బుక్ లో వైరల్ అయింది.
పనోరమా.పబ్ అనే రష్యా వెబ్ సైట్ 2019 మార్చి 3వ తేదీన ఒక కథనం ప్రచురించింది. దాని శీర్షిక రష్యన్ భాషలో ఇలా ఉంది…“Япония окончательно откажется от СВЧ-печей к 2020 году . జపాన్ ఎట్టకేలకు మైక్రోవేవ్ ఓవెన్లను 2020 నుంచి నిషేధిస్తోంది అని దానికి అర్థం.
అయితే ఈ వెబ్ సైట్ కింది భాగంలో ఇది సెటైర్ మాత్రమేన్న విషయం స్పష్టంగా పేర్కొంది. పనోరమా అనేది సెటైరికల్ ప్రచురణ సంస్థ అని తెలిపింది. ఇందులోని వార్తలన్నీ సరదాగా రాసినవే తప్ప వాస్తవాలు కాదని స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఈ కథనంలో ఉన్న మొదటి పేరాను గూగుల్ అనువాదం ద్వారా చూస్తే ఇంటర్ నెట్ లో సాగుతున్న ప్రచారానికి సరిగ్గా సరిపోయింది. ‘‘జపాన్ ప్రభుత్వం తమ దేశంలో ఉన్న మైక్రోవేవ్ ఓవెన్లన్నింటినీ ధ్వంసం చేయాలని నిర్ణయించింది. దాన్ని పాటించకపోతే 5 నుంచి 15 ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది’’ అని అందులో తెలిపారు. అంటే, సరదాకి రాసిన విషయాన్ని తీసుకుని.. దాన్ని యథాతథంగా నిజమైన వార్తలా ప్రచారం చేసేస్తున్నారన్న మాట.