(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ కళ్యాణ్ నేడు పరామర్శించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుండి రోడ్డు మార్గంలో కాకినాడకు బయలుదేరారు. పవన్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 విధించారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుండి జనసేన కార్యకర్తలు, అభిమానులు కాకినాడకు తరలివస్తున్నారు. పవన్పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మరో సారి అనడంతో ఎమ్మెల్యేని అరెస్టు చేసే వరకూ ఉద్యమిస్తామని జనసేన నేతలు పేర్కొంటున్నారు. దీంతో ఆదివారం నాటి పరిస్థితులు పునరావృత్తం అవుతాయేమోనని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కాకినాడలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జనసేన కార్యకర్తలపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ కింద కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబడుతూ కాకినాడకే వచ్చి తేల్చుకుంటానని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రకటించిన విధంగానే నేడు కాకినాడకు బయలుదేరారు. కాకినాడలో బాధితులను పరామర్శించిన తరువాత ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.