న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీతో పాటు అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదంటూ రాహుల్గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు తిరిగి వెనక్కి పంపించారు. రాజకీయ నేతలు ఎవరూ రావొద్దని, కాశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెప్పారు.
జమ్ముకాశ్మీర్ పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్కు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 11 విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఇవాళ ఉదయం వెళ్లిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీతోపాటు, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత దినేష్ త్రివేది, డీఎంకే నేత తిరుచ్చి శివ తదితరులు ఉన్నారు.