న్యూఢిల్లీ: కశ్మీర్లో శనివారం ఆంక్షలు కొంత సడలించారు. కశ్మీర్ లోయ కొన్ని భాగాల్లో దాదాపు 50 వేల ల్యాండ్లైన్ ఫోన్లు పునరుద్ధరించారు. కొన్ని ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూసేందుకు విధించిన నిషేధాజ్ఞలు కూడా తాత్కాలికంగా కొంతమేర సడలించామని అధికారవర్గాలు తెలిపాయి.
కశ్మీర్ లోయ అంతటా భారీ బందోబస్తు మాత్రం కొనసాగుతోంది. ఆగస్టు అయిదున జమ్ము కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేయడానికి ఒకరోజు ముందు నుంచీ రాష్ట్రంలో తీవ్ర నిర్బంధం అమలులో ఉంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా దాదాపు 400 మందీ రాజకీయ నాయకులు ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నారు. ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేశారు. 50 వేల మంది పారా మిలటరీ బలగాల సిబ్బందిని మోహరించారు.
గత బుధవారం నాడు జమ్ములో ఆంక్షలు ఎత్తివేశారు. తాజాగా లోయలో 100 టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లకు గాను 17 ఎక్స్ఛేంజ్లు పని చేయడం ప్రారంభించాయి.