న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో తొలి ప్రాధాన్యం ఇవ్వగా.. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం లభించింది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో రూ.69 వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఆరోగ్య రంగానికి కేటాయింపులు పది శాతం మేర పెరిగాయి. గత ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.62,659 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ఇది 2.5 శాతానికి సమానం. ఈ ఏడాది ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ పది శాతం పెంపుతో సరిపెట్టారు. 2019కి ముందు వరకూ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఒక శాతానికి మించలేదు.
ఆయుష్మాన్ భారత్ పథకానికి గత బడ్జెట్లో కేటాయించినట్టుగానే.. రూ.6400 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.12,300 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భవనతో దేశవ్యాప్తంగా ఇరవై వేల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. చౌక ధరలకే మందులు లభించే జనఔషధీ కేంద్రాలను దేశంలోని అన్ని జిల్లాలకు విస్తారిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల దేశ ప్రజలకు ఎంతో మేలు జరిగిందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఏడాది ఆయుష్మాన్ భారత్ పథకం కింద 6.9 మిలియన్ల చికిత్సలు జరిగాయి.