అమరావతి: ఈ నెల 30వ తదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం సందర్శకులతో సందడిగా మారింది. ఎన్నికల ఫలితాల ముందురోజు జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి మారిన విషయం తెలిసిందే. జగన్ నివాసం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు క్యూకట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం గురువారం మధ్యాహ్నమే జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని జగన్ సూచిస్తూ ఆయన్నే సిఎస్గా కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. తదుపరి డిజిపి ఠాకూర్ జగన్మోహనరెడ్డితో సమావేశమయ్యారు. బందోబస్తు చర్యలపై అక్కడి పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. శుక్రవారం వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు జగన్ నివాసంలో భేటీ అయ్యారు. ఐఎఎస్ అధికారులు జయశ్రీ ప్రసాదం, సాంబశివరావు, కరికల వలవన్, అహ్మద్ బాబు, కన్నబాబు, ముద్దాడ రవిచంద్ర. సత్యనారాయణ, సంధ్యారాణి, అజయ్ జైన్, గిరిజాశంకర్, రాజమౌళి తదితర ఐఎఎస్ అధికారులు ఆయా శాఖల సమాచారాన్ని జగన్మోహనరెడ్డికి వివరించినట్లు సమాచారం. 37ప్రభుత్వ శాఖలకు చెందిన 57మంది ఉన్నతాధికారులు జగన్మోహనరెడ్డిని కలిశారు.
టిటిడి కార్యనిర్వహణ అధికారి సింఘాల్ ఆధ్వర్యంలో టిటిడి వేదపండితులు జగన్ నివాసానికి చేరుకొని ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.