(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ)లో ఉద్రిక్తత నెలకొంది. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ప్రొఫెసర్లు, విద్యార్థులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్యూఎస్యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తల పగిలింది. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు యాభై మంది వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్టు తెలుస్తోంది. ఏబీవీపీ వాళ్లే దాడికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీ దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ముసుగులు ధరించి దాడి చేసిన వారిలో కొందరిని గుర్తించినట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు పోలీసులు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు.
https://youtu.be/pi9XFuIePF8
క్యాంపస్లో ఇంతటి భయానక వాతావరణం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు పట్టించుకోలేదని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్ధిసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యూనివర్సిటీలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ దగ్గర ఆందోళనలు చేపట్టారు. వారికి సంఘీభావంగా.. ముంబైలో విద్యార్ధి లోకం కదం తొక్కింది. వేలాది మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర సమావేశమయ్యారు. వారు దుండగులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ కు చెందిన విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ హస్తం ఉందని ఆరోపించారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు.. జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపూతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ లో కూడా విద్యార్థులు ప్రదర్శనలను నిర్వహించారు.
#WATCH Delhi: 'Delhi police, go back' slogans raised during the flag march conducted by police inside Jawaharlal Nehru University (JNU) campus. pic.twitter.com/w5OYN3DAo0
— ANI (@ANI) January 5, 2020
జేఎన్యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జేఎన్యూలో మసుగు మూకల వీరంగానికి సంబంధించి తాజా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దుండగులు తమపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులు, వర్సిటీ భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నారని, అయితే దాడుల్ని ఆపే ప్రయత్నం చేయలేదని జేఎన్యూఎస్యూ వైస్ ప్రెసిడెంట్ సాకేత్ మూన్ ఆరోపించారు.
మరోవైపు జేఎన్యూ విద్యార్థులపై ముసుగు గూండాల దాడిని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, అధికార, విపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. జేఎన్యూ దాడి ఘటనను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, చిదంబరం ఖండించారు. విద్యార్థులపై దాడి హేయమైన చర్య అని, నియంతల చేతుల్లో దేశం బందీగా మారిందని రాహుల్ అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ మద్దతుతోనే జరుగుతాయని, వర్సిటీ విద్యార్థులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చిదంబరం ప్రశ్నించారు. వర్సిటీలో విద్యార్థులపై దాడులను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ ఖండించారు. జేఎన్యూ ఘటనపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పరిస్థితులపై ఆరా తీశారు. వర్సిటీ ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. పోలీసులు వెంటనే వర్సిటీలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని ఆదేశించారు.