(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతూ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల అంశంలో తొలుత బిజెపి నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసినప్పటికీ తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్నది తమ పార్టీ స్టాండ్గా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా అమరావతికి మద్దతుగా రాష్ట్ర బిజెపి నాయకత్వం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దయోధర్ నాయకత్వంలో పార్టీ జాతీయ కౌన్సిల్కు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు, మహిళలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
ప్రధాని మోది స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేయడం, కేంద్రం ఇప్పటి వరకూ 2500 కోట్ల రూపాయలు ఇవ్వడం, రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవేలకు ఆర్థిక సహాయం, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ముందుకు రావడం, హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ఇలా ఇన్ని జరిగిన తరువాత రాజధాని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోవడం సరైంది కాదనీ బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరో పక్క అఖిల భారత హిందూ మహసభ కూడా జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నది. హైందవ ప్రాశస్త్యం కలిగిన నగరాలను అణగదొక్కాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ఆరోపించారు. అయోధ్య నుండి 20 వేల మంది హిందువులతో అమరావతి పర్యటనకు వస్తాననీ కూడా ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో 20 వేల మందితో ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర ఇన్చార్జి, ప్రముఖ న్యాయవాది జంద్యాల రవిశంకర్ తెలియజేశారు.
జగన్మోహనరెడ్డి ఆలోచనా విధానాలకు అనుగుణంగానే జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదకలు ప్రభుత్వానికి అందిన విషయం తెలిసిందే. ఈ రెండు నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. దానిపై మంత్రివర్గంలో చర్చించి మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు.