న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ బిర్రు ప్రతాప్రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని..ఏపీలో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేనందున తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం స్థానాలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం 176వ నంబరు జీవోను జారీ చేసింది. ఫిబ్రవరిలో పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈసీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, రామాంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్ అలా ఉండగానే.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చంటూ హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసింది. ప్రభుత్వ వాదన విన్న తరువాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 17న నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్లు పరిశీలించిన సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.