(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సిఎం జగన్ తీరుపై టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ జెసి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బుధవారం రాజధాని ప్రాంత రైతులను పరామర్శించడానికి వచ్చిన జెసి..పలు విషయాల గురించి మీడియాతో మాట్లాడారు.
ఏడాది లోపు జగన్ సతీమణి వైఎస్ భారతి ముఖ్యమంత్రి అవుతారని జెసి జోస్యం చెప్పారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని జగన్ కోల్పోయాడని అన్నారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు. మూర్ఖత్వపు నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని జెసి అన్నారు. ఒక కులంపై, వ్యక్తిపై ధ్వేషంతో రాష్ట్రాన్ని ఇలా చేయడం సరికాదని సూచించారు. ఓ ఏడాది, ఏడాదిన్నరలో భారతి సిఎం కావచ్చని చెప్పారు.
విశాఖలో రాజధాని పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకుంటే సరిపోదనీ, అందరి అభిప్రాయాలను తీసుకోవాలనీ జెసి అన్నారు. అమరావతిలో మెజార్టీ భూములు కొని ఉండొచ్చేమో కానీ.. కమ్మ వాళ్లు మాత్రమే భూములు కొనలేదనీ అన్నారు. డబ్బులు ఉన్న వాళ్లు వచ్చి భూములు కొంటే రైతులకు ఏమినష్టం అని ప్రశ్నించారు. విశాఖలో మాత్రం వైసిపి నేతలు భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ఏడు నెలలుగా విజయసాయిరెడ్డి ఢిల్లీ- విశాఖ చక్కర్లు కొట్టారని అన్నారు.
జగన్కు ఎన్నికల్లో కెసిఆర్ ఆర్థిక సాయం అందించారనీ, అందుకు ప్రతిగా జగన్ రెట్టింపు చెల్లించారని జెసి అన్నారు. కెసిఆర్ విషయంలో జగన్ గురు భక్తి చాటుకున్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు చేసేయ్ అని కెసిఆర్ జగన్కు చెప్పాడని ప్రచారం జరుగుతోందని జెసి అన్నారు.
అమరావతి రాజధానిని మంత్రి బొత్సా స్మశానంగా పోల్చడంపై మాట్లాడుతూ.. నిజంగా మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమేనని వ్యాఖ్యానించారు. మనిషికి తల ఎంత ముఖ్యమో రాజధానికి సెక్రటేరియేట్, అసెంబ్లీ అంతే ముఖ్యమని జెసి అన్నారు. అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందనీ, దీన్ని రాజధాని కాదని చెప్పడానికి తాతలు దిగిరావాలని ఆయన వ్యాఖ్యానించారు.