అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేయడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణించి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో పాటు పార్లమెంట్లోనూ ప్రస్తావించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిపి ఆదేశాల మేరకు గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పి నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. అక్కడ జరిగిన ఘర్షణ, పోలీసుల అలసత్వంపై కూడా సిట్ విచారించనున్నది.
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పు రువ్విన ఘటనకు సంబంధించి బాపయ్య, సందీప్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పెట్టిన అన్ని కేసులనూ సిట్కి బదిలీ చేశారు. ఏడు రోజుల్లో ప్రభుత్వానికి సిట్ టీమ్ నివేదిక ఇవ్వనున్నది.
ఈ ఘటనపై ఐజి బ్రిజ్లాల్ స్పందిస్తూ నిరసన కారులు బస్సుపైకి చిన్న రాయి, ఓ చెప్పు విసిరారనీ, లాఠీ విసిరారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనీ అన్నారు. బస్సుపై దాడికి పాల్పడిన వారిపై 352, 290, 188 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల పాత్రపై వారం రోజుల్లోగా నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబు ప్రయాణించిన బస్సును సీజ్ చేశామనీ, బస్సు అద్దం కొంత మేరకు ముందుభాగంలో పగిలిందనీ ఆయన చెప్పారు.
అదే రోజు రాజధాని ప్రాంతంలో అధికారుల అనుమతి లేకుండా టిడిపి నేతలు డ్రోన్ కెమెరాలను వినియోగించారంటూ వైసిపి గుంటూరు పార్లమెంటరీ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.