అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఇసుక కొరతపై పోరాడుతున్న రాజకీయ పార్టీలపై అధికారపక్షం ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. జనసేన నాయకుడు లాంగ్ మార్చ్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేశారని, ఇలా విమర్శలు చేసే వారిని వ్యక్తిగతంగా దూషిస్తే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. విమర్శలు చేయడం కాదు ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు.
ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కాలం తీరి చనిపోయారంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల నాశనమైనా ఫర్వాలేదని.. తన అనుకునే వాళ్లు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పేదల్ని బలి తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. లక్షల మంది కార్మికులు అర్ధాకలితో అమలటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, మృతి చెందిన కార్మిక కుటంబాలకు రూ.25 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను కట్టడి చేసి, ఉచితంగా ఇసుకను ఇవ్వాలని అన్నారు. జగన్ లాంటి కుటిల రాజకీయాల చేసే వారిని కొన్ని వేల మందిని చూశానన్నారు. ఇద్దర్ని పార్టీ నుంచి తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని.. ఒకరు వెళ్తే వంద మంది నాయకులను తయారు చేస్తానన్నారు. ప్రజలు మందు వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని చంద్రబాబు పేర్కొన్నారు.