అమరావతి: చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చివేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావులు మీడియా ముందు జగన్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కళా వెంకట్రావు ఆరోపించారు. ఓర్వలేనితనంతోనే ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక ఆధారంగా సిఎం జగన్ రాజకీయం చేయడం సరికాదని కళా వెంకట్రావు హితవు పలికారు. జగన్ చేస్తున్న చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కళా కోరారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రాత్రికి రాత్రే కూల్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి అన్ని వసతులు ఏర్పడే వరకూ ప్రజావేదికను వాడుకోవచ్చు కదా అని కాల్వ ప్రశ్నించారు. ప్రజావేదికలోని ఫర్నీచర్ను వేలం పాటలో అమ్ముకోవాలని కాల్వ ఎద్దేవా చేశారు. సిఎం స్థాయి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయని కాల్వ అన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని కాల్వ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ చర్యలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే వైసిపి విధ్వంసకర ప్రభుత్వమని దేవినేని అన్నారు.
‘హైదరాబాద్, బంజరాహిల్స్లోని రోడ్ నెంబర్ రెండులో వైఎస్ నివాసం ఉన్న ఇల్లు అక్రమ కట్టడమేనని దేవినేని ఉమ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి షబ్బీర్ ఆలీ దాన్ని క్రమబద్దీకరణ చేశారు. ఆ తరువాత వైఎస్ జగన్ దాన్ని రాజ్ టవర్స్గా మార్చి పెద్ద కాంప్లెక్స్ను కట్టారు. బ్యాంకులు, కంపెనీలకు అద్దెలకు ఇచ్చారు. వైఎస్ ప్రతిపక్షం నుండి అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం కాస్తా సక్రమ కట్టడం అయిపోయింది. ఇక హైదరాబాదులోని లోటస్ పాండ్ (జగన్ నివాసం) దగ్గర చెరువు భూములను కూడా రెగ్యులరైజ్ చేసుకున్నారు. అక్కడే పెద్ద భవనాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి జగన్మోహనరెడ్డి నీతులు చెబుతున్నారు’ అని ఉమా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజావేదికను కూల్చి వైసిపి వారు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దేవినేని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చిన జగన్ నేడు సీనియర్ అధికారులను అన్నా అని సంబోధిస్తూ అవినీతిని బయటపెట్టండి అంటూ ప్రాధేయపడుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు.