అమరావతి: అంతర్గత విభేధాలతో కొద్ది కాలంగా టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కాపు నేతల వివాదం సమసినట్లుగానే కనబడుతోంది. వీరు నిన్న పార్టీ అధినేత చంద్రబాబును కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం వీరు పార్టీపై విధేయతను వ్యక్తం చేశారు. పార్టీలోనే కొనసాగుతామనీ. పార్టీ వీడే ఆలోచనే లేదనీ స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే..పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకోవడం పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపింది. అదే తరుణంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలు కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించారని తెలియడంతో వీరు కూడా రేపో మాపో పార్టీ మారనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పార్టీ నాయకత్వానికి తెలియకుండా సమూహంగా ఒక సామాజిక వర్గ నేతలు భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత చంద్రబాబు నివాసంలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి ఈ నేతలు గైరు హజరు కావడంతో వీరు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరినట్లైనది. ఈ నేపథ్యంలో నిన్న మరో మారు పార్టీ నేతలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితరులు విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నివాసంలో సమావేశమైయ్యారు. అనంతరం వీరు పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ ఇంత ఘోరంగా ఓటమిపాలవ్వడానికి కారణాలతో పాటు వారి మనసులోని భావాలను చంద్రబాబు ముందు ఉంచారు. ఎన్నికల్లో జనసేన పార్టీ వల్లే కాపుల ఓట్లలో చీలికవచ్చి పార్టీ పరాజయానికి కారణమైందన్న అంశాన్ని తెలియజేశారు. అదే విధంగా ముద్రగడ పద్మనాభం దీక్షల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తదితర విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
నేతల సూచనలన్ని సావధానంగా ఆలకించిన చంద్రబాబు ‘ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటా. లోపాలను సవరించుకుందాం’ అని హామీ ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలను పెట్టవద్దనీ, ఇలాంటివి పార్టీకి ఇబ్బందికరమని చంద్రబాబు వారికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు వారికి తెలిపారు.
అధినేతతో భేటీ అనంతరం నేతలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బొండా ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ జనసేన వల్ల దూరమైన ఓటు బ్యాంక్ను తిరిగి పొందేందుకు అవసరమైన కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. తాము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తామనీ, పార్టీలోనే ఉండి అంతర్గతంగా ఎదురవుతున్న సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.
చంద్రబాబుతో కాపునేతల భేటీ ఫలప్రదం అవ్వడంతో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారిన ఈ వివాదం సమసినట్లైయింది.