(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో 20 వ తేదీ నిర్వహిస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సిఎం జగన్మోహనరెడ్డి తాత రాజారెడ్డి వచ్చినా కూడా ఆపలేరని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఇది ప్రజా ఉద్యమంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపించేలా ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన ఉందని విమర్శించారు. రేపు జరగబోయే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భారీ ర్యాలీగా ప్రజలతో కలిసి వెళుతున్నామనీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తామనీ బుద్దా అన్నారు.
రాజధాని తరలింపు అడ్డుకోవడానికి ప్రాణ త్యాగాలకైనా సిద్ధమనీ, బుల్లెట్లకు ఎదురొడ్డుతామనీ పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తమ శవాల మీద వెళ్లి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోండని అన్నారు. పశ్చిమ బెంగాల్లో రైతులు ఉద్యమం చేస్తే టాటా కంపెనీ వెనక్కి వెళ్లిపోయిన విషయాన్ని బుద్దా గుర్తు చేశారు. చంద్రాబాబుకు పేరు వస్తుందన్న అక్కసుతో రాజధాని మార్చాలను కోవడం తగదని అన్నారు. రాష్ట్రానికి మంచి చేస్తాడని ప్రజలు జగన్కు ఓట్లు వేసి అధికారం కట్టబెడితే ప్రజల నోట్లో మట్టికొడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.