(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారం నాటికి 33వ రోజుకు చేరింది.
మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు రిలే దీక్షలు చేపట్టారు. ఉద్దండరాయునిపాలెంలో మహిళా రైతులు అమరావతి కోసం పూజలు చేస్తున్నారు.
మందడం శివాలయం నుండి మహిళలు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి బయలు దేరారు. మొక్కులు తీర్చుకునేందుకు మార్గమధ్యలోని గ్రామాల మహిళలతో కలిసి పొంగళ్లతో 13 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మందడం, వెలగపూడి గ్రామాల రైతులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమ్మవారిని వేడుకోనున్నారు.
నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. తుళ్లూరులో మహాధర్నాతో పాటు వంటవార్పు నిర్వహించనున్నారు.
నెల రోజులకుపైగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.