(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రగతిభవన్లో కెసిఆర్తో సమావేశమయ్యారు.
తాజా రాజకీయ అంశాలతో పాటు విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్డు సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.
ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిసి, రాష్ట్ర ఆర్థిక సంస్థల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపైగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇద్దరు సీఎంల మధ్య గతంలో మూడు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించనున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ వెంట వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
తొలుత ప్రగతి భవన్కు చేరుకున్న వైఎస్ జగన్ను కెసిఆర్ తో పాటు ఆయన తనయుడు, మంత్రి కెటిఆర్ స్వాగతం పలికారు.