పుల్వామా టెరరిస్టు దాడి నేపధ్యంలో ప్రతీకారం డిమాండ్లు దేశం అంతటా వినబడుతున్నాయి. బాధ్యత ఉన్న వారు లేని వారు అందరూ పగ తీర్చుకోవాల్సిందేనంటున్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగం వృధా పోదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా తన గుండెలు మండుతున్నాయని అన్నారు. మరోపక్క పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో నిర్ధారించింది.
మొన్న ప్రధాని, ఎలాంటి చర్య తీసుకునేందుకైనా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు. ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నవారి స్పందన చూస్తుంటే పాకిస్థాన్పై ఏదో ఒక చర్య తప్పక పోవచ్చని అనిపిస్తోంది.
అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రతీకారం గురించే మాట్లాడుతూ దానికి రాజకీయం జోడించారు. ఈసారి జవాన్ల త్యాగం వృధా పోదు. కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాదు, ఇది మోదీ ప్రభుత్వం అని ఆయన అసోంలో ఒక సభలో పేర్కొన్నారు.
40 మంది కేంద్ర రిజర్వు పోలీసు దళం జవాన్ల మృతికి కారణమైన పుల్వామా దాడికి అమెరికా స్పందన కూడా గతంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఉన్న దానికి భిన్నంగా ఉంది. ఇంతవరకూ ఇలాంటి దాడులను ఖండిస్తూనే అమెరికా నిగ్రహం పాటించాలని ఇండియాకు హితవు చెప్పేది. ఈసారి ప్రప్రధమంగా ప్రతీకార చర్యలకు పాల్పడేందుకు ఇండియాకు హక్కుందని అమెరికా వ్యాఖ్యానించింది.
ప్రధానమంత్రి ఆదివారం బీహార్లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ‘ఇక్కడున్న ప్రజల గుండెల్లో ఎంత మంట ఉందో నా గుండెల్లో కూడా అదే మంట ఉంది’ అని ఆయన అన్నారు. ఆ సభలోనే పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి తగిన చర్య తీసుకోవాలని అనగా, కేంద్రమంత్రి రామ్విలాస్ పశ్వాన్ ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకోవాలన్నారు.
పుల్వామా దాడి నేపధ్యంలో ఇండియా తక్షణ స్పందనగా, పాకిస్థాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతా దేశం హోదాను రద్దు చేసింది. పాకిస్థాన్ నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 200 శాతం పెంచింది. మరోపక్క జమ్ము కాశ్మీర్లో వేర్పాటువాద నాయకులకు ప్రభుత్వం భద్రత తొలగించింది.