అమెరికాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ఆల్డర్మాన్, నెదర్లాండ్స్లో ఇవిఎంల ఉపసంహరణకు ప్రధాన కారకుడైన గోంగ్రిప్తో హరిప్రసాద్
అమరావతి: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్ మీద యుద్ధం ప్రకటించిన సందర్భంగా హరిప్రసాద్ అనే పేరు బయటకు వచ్చింది. ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆ హరిప్రసాద్ అన్న వ్యక్తి గురించే మీడియా ప్రముఖంగా రాసింది, ప్రసారం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సపరివార సమేతంగా ఢిల్లీ వెళ్లి ఫుల్ కమిషన్తో సమావేశమై అడగాల్సిన నాలుగూ అడేగేశారు. ఆపై బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్పై తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు ఇచ్చిన 15 పేజీల వినతిపత్రానికి అప్పటికప్పుడు సమాధానం రాసి పంపిన కమిషన్ అందులో వేమూరు హరిప్రసాద్ అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రతినిధివర్గంలో తీసుకురావడం విచిత్రంగా ఉందని కమిషన్ వ్యాఖ్యానించింది. అతనికి వివరణ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది.
టిడిపి తరపున రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వెంటనే దానికి జవాబు రాశారు. హరిప్రసాద్ ముఖ్యమంత్రికి సాంకేతిక సలహాదారు అని పేర్కొంటూ, ఆయనకే వివరణ ఇవ్వాలని స్పష్టం చేసారు.
ఇంతకీ ఈ హరిప్రసాద్ ఎవరు? ఆయనపై కేసు ఏమిటి? ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలకు వ్యతిరేకంగా హరిప్రసాద్ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయనపై ఉన్న కేసు కూడా దానికి సంబంధించినదే. ఇవిఎంలను హాకింగ్ చేయవచ్చని నిరూపించేందుకు పరిప్రసాద్ హైదరాబాద్లో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి ప్రదర్శన ఇచ్చారు.
ఈ విషయంలో ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కు సవాలు కూడా విసిరారు. ఇవిఎంలు ప్రభుత్వ ఆస్థి కాబట్టి అది ప్రయివేటు వ్యక్తుల దగ్గర ఉండడం నేరం అంటూ హరిప్రసాద్పై దొంగతనం కేసు పెట్టారు. దానికి సంబంధించి 2010 ఆగస్టులో ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఇంతవరకూ ఛార్జ్షీటు దాఖలు కాలేదు.
నిజానికి హరిప్రసాద్ ఇవిఎంల పనితీరుపై చేసిన పరిశోధనకు అంతర్జాతీయంగా చాలా గుర్తింపు వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గతంలో ఆయన సేవలను గుర్తించింది. ఎన్నికల కమిషన్ వివిపాట్లు తీసురావడానికి కారణమైన వారిలో హరిప్రసాద్ కూడా ఒకరు. ఇప్పుడు ఆ హరిప్రసాద్పై 2010 నాటి ఎఫ్ఐఆర్ చూపించి ఇవిఎంల పనితీరు గురించి ఆయనతో చర్చించేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరిస్తున్నది.