(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్ రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు.
గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుండి డిప్యుటేషన్పై రాష్ట్రానికి వచ్చి కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులకు జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వారు డిప్యుటిషన్ రద్దు చేసుకుని తిరిగి కేంద్ర సర్వీసులకు వెళుతున్నారు.
రెండు రోజుల క్రితం ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ను జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. టిడిపి ప్రభుత్వం హయాంలో ఆయన ఏపి ఆర్థిక అభివృద్ధి మండలి సిఇఒగా పని చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుండి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం ఆయన హయాంలో జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని సిఐడి, ఏసిబి డిజిలను ప్రభుత్వం ఆదేశించింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని కూడా డెడ్లైన్ విధించింది.
ఈ నేపథ్యంలో తనకు ఇబ్బందులు తప్పవని భావించిన ఐఆర్ఎస్ అధికారి సిహెచ్ వెంకట గోపీనాధ్ తన డిప్యుటేషన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఏడాది జూన్ 26 వరకూ డిప్యుటేషన్ గడువు ఉన్నప్పటికీ తన డిప్యుటేషన్ రద్దు చేయాలని కోరడంతో ఆయనను రాష్ట్ర సర్వీసుల నుండి ప్రభుత్వం రిలీవ్ చేసింది.
గోపీనాధ్ ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపిఎంఎస్ ఐడిసి) మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు.
తొలుత ఏపి మైనింగ్ కార్పోరేషన్ ఎండిగా పని చేసిన వెంకయ్య చౌదరి తన డిప్యుటేషన్ గడువు ముగియగానే మాతృసంస్థకు వెళ్లిపోయారు.