అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ జగన్మోహనరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో పరిపాలన అంతా ఒక చోట నుండి జరిగితే బాగుంటుందని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంత రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిరసనలో ఆయన ఫోటో ప్రదర్శిస్తూ హాట్సాప్ కూడా చెప్పారు. అధికార పార్టీలోనే రాజధానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాల నేపథ్యంలో గోపిరెడ్డి శ్రీనివాసరావు వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. తన మాటలను కొన్ని మీడియా సంస్ధలు వక్రీకరించాయని గోపిరెడ్డి ఆరోపించారు. తాను మాట్లాడినదానికి తల,తొక తీసేసి కొన్ని పార్టులు,పార్టులుగా విడగొట్టి ప్రసారం చేశాయని అన్నారు.ఈ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన జరిగి హైదరాబాదు కోల్పోవడం వల్ల ఎన్ని నష్టాలు జరిగాయే ప్రజలందరికీ తెలుసునన్నారు. కేంద్ర సంస్ధలన్నీ కూడా హైద్రాబాద్ లో పెట్టడం వల్ల, పెట్టుబడులు అక్కడకే వచ్చి సెంట్రలైజేషన్ జరిగి మిగిలిన ప్రాంతం నిర్లక్ష్యానికి గురి అయ్యిందన్నారు. ఉత్తరాంధ్ర గాని,రాయలసీమలో గాని వెనకబడిన జిల్లాలు దాదాపు ఏడు ఉన్నాయన్నారు. సెంట్రలైజేషన్ జరిగి విభజన తర్వాత హైద్రాబాద్ నగరాన్ని కోల్పోవడం వల్ల మనం ఓ గుణపాఠం నేర్చుకున్నామనీ, అది తెలుసుకుని వికేంద్రీకరణ జరగాలనీ శివరామకృష్ణన్ కమిటి కూడా చెప్పిందని గోపిరెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో కూడా అదే చెప్పారనీ ఆ ప్రకటనలో భాగంగా లెజిస్లేచివ్ కేపిటల్ అమరావతిలో, కర్నూలులో జ్యుడిషయల్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలనే దిశగా ఏం చెప్పారో దానికి తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. 50 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనంతో ఉందని అన్నారు. అక్కడ గమనిస్తే ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడటం చూస్తున్నామన్నారు. వాటిని కూడా అభివృధ్ది చేసుకోవాల్సిన అవసరం ఉందనీ, ఆ విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు.
అమరావతిని తీసుకుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజధాని ప్రకటన చేసే వరకు సుమారు నాలుగు వేల ఎకరాలు టిడిపి నేతలు కొనుగోలు చేశారనీ, దీనికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ వివరాలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారనీ చెప్పారు.పెట్టుబడులు కావాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. ఒకే చోట అభివృద్ది జరిగితే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వికేంద్రీకరణ అవసరమని గోపిరెడ్డి అన్నారు. సిఎం జగన్ చేసిన ప్రకటనను అందరూ అర్దం చేసుకుని మద్దతు పలకాలని గోపిరెడ్డి కోరారు.తాను పార్టీ పెట్టినప్పటి నుండి వైయస్ జగన్ అడుగుజాడలలో నడుస్తున్నాననీ జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.